ఆర్థిక సంఘం నిధుల వినియోగం ఆపండి.. పంచాయతీలకు అధికారుల ఆదేశాలు
అమరావతి
: తదుపరి ఆదేశాలు వెలువడే వరకు పంచాయతీల్లో 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగం నిలిపివేయాలని పంచాయతీలు, మండల పరిషత్లను ఆదేశిస్తూ పలు జిల్లాల్లో అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. వీటిని విధిగా పాటించాలని, విరుద్ధంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుల పదవీకాలం మరో మూడు నెలల్లో ముగియనున్న నేపథ్యంలో ఆర్థిక సంఘం నిధులను ఖాళీ చేసేందుకు పంచాయతీల్లో సర్పంచులు యత్నిస్తున్నారు.
పాత పనుల బిల్లులు చెల్లించాలని కార్యదర్శులపై కొందరు సర్పంచులు ఒత్తిడి చేస్తున్నారని, చేయని పనులకూ బిల్లులు సృష్టిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ కార్యాలయం అప్రమత్తమైన విషయం తెలిసిందే. జిల్లాపరిషత్ సీఈవోలు, జిల్లా పంచాయతీ అధికారులతో ఇటీవల నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో ఆర్థిక సంఘం నిధుల వినియోగాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని, ఎలాంటి బిల్లులూ చెల్లించవద్దని ఉన్నతాధికారులు ఆదేశించారు. మళ్లీ ఆదేశాలిచ్చే వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని సూచించారు.
