“క్వాంటం టాక్ బై సీఎం సీబీఎన్” కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లెక్చర్

0
FB_IMG_1766479993019

క్వాంటం రంగంలో ఏపీది లీడ్ రోల్

ఏపీలో క్వాంటం స్కిల్ రోడ్ మ్యాప్‌ సిద్దం

రెండేళ్లల్లో అమరావతి నుంచే క్వాంటం పరికరాల ఉత్పత్తి

క్వాంటం విజన్ ను, విప్లవాన్ని అందిపుచ్చుకోండి

క్వాంటం టెక్నాలజీతో నోబెల్ స్థాయికి మన పరిశోధనలు చేరాలి

క్వాంటం ప్రోగ్రామ్ లో వివిధ అంశాలను ప్రజెంటేషన్ ద్వారా టెక్ విద్యార్ధులకు వివరించిన సీఎం

అమరావతి: భారత్ దేశంలో క్వాంటం టెక్నాలజీ విప్లవానికి ఆంధ్రప్రదేశ్ నాయకత్వం వహిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. క్వాంటం సహా దాని అనుబంధ రంగాల్లో నిపుణులను తయారు చేసేలా తాము కార్యాచరణ సిద్దం చేశామని తెలిపారు. ఏపీ ప్రభుత్వం, వైసర్, క్యూబిట్ సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న క్వాంటం ప్రోగ్రామ్ లో భాగంగా వేల మంది టెక్ విద్యార్ధులతో ముఖ్యమంత్రి క్వాంటం టాక్ బై సీబీఎన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. క్వాంటం టెక్నాలజీకి సంబంధించి నిర్వహిస్తున్న అతిపెద్ద శిక్షణా కార్యక్రమంలో డిజిటల్ మాధ్యమం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు టెక్ విద్యార్ధులను ఉద్దేశించి మాట్లాడారు. క్వాంటం టెక్నాలజీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇచ్చిన విజన్ ను అందిపుచ్చుకోవాలని విద్యార్ధులకు పిలుపునిచ్చారు. ఈ క్వాంటం టాక్ బై సీబీఎన్ కార్యక్రమానికి క్వాంటం ప్రోగ్రామ్ కు రిజిస్ట్రేషన్ చేసుకున్న వేల మంది విద్యార్ధులు పాల్గొన్నారు. అలాగే అమెరికా నుంచి వైసర్ సంస్థ ప్రతినిధులు, క్యూబిట్, ఐబీఎం సంస్థల ప్రతినిధులతో పాటు ఆంధ్రా యూనివర్సిటీ సహా వేర్వేరు ఇంజనీరింగ్ టెక్నాలజీ కళాశాలల విద్యార్ధులు, ప్రొఫెసర్లు పెద్ద ఎత్తున హాజరయ్యారు. క్వాంటం మెకానిక్స్, అల్గారిథమ్స్ లాంటి అంశాల్లో 10 లక్షల మంది నిపుణుల్ని, క్వాంటం సాఫ్ట్వేర్, హార్డ్ వేర్ రంగాల్లో 3 లక్షల మందిని, అడ్వాన్స్ డ్ రీసెర్చి లో 1 లక్ష మంది నిపుణుల్ని తయారు చేస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వెల్లడించారు. క్వాంటం టాక్ బై సీబీఎన్ కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ”ఐటీ విప్లవం అందిపుచ్చుకుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఐటీ నిపుణుల్ని తయారు చేసి ప్రపంచానికి అందించాం. సైబరాబాద్ నిర్మాణం ద్వారా హైదరాబాద్ ఐటీ గ్లోబల్ హబ్ గా ఎదిగింది. సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల, అరవింద్ కృష్ణ లాంటి భారతీయులే గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ కంపెనీలకు నాయకత్వం వహిస్తున్నారు. విశాఖలోనూ ఇప్పుడు గూగుల్ అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతోంది. గతంలో ఐటీఈఎస్ లాంటి సేవల్ని వివిధ దేశాలకు ఇక్కడి నుంచే అందించాం. విశాఖ ఇప్పుడు డేటా సెంటర్లకు గ్లోబల్ హబ్ గా మారుతోంది. ఇక్కడి నుంచే సబ్ సీ కేబుల్ లాంటి వ్యవస్థ కూడా ఏర్పాటు అవుతోంది. అమరావతి నాలెడ్జి ఎకానమీ, క్వాంటం వ్యాలీగా ఉంటుంది. తిరుపతి స్పేస్ సిటీగా నిర్మితం అవుతుంది. అనంతపురం, కడప లాంటి ప్రాంతాలు ఎలక్ట్రానిక్స్ ఏరో స్పేస్ కేంద్రాలుగా ఉంటాయి. విశాఖ- చెన్నై, చెన్నై-బెంగుళూరు, బెంగుళూరు- హైదరాబాద్ కారిడార్లు అతిపెద్ద పారిశ్రామిక కారిడార్లుగా మారుతున్నాయి. ఏపీని క్వాంటంతో పాటు గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా మారుస్తున్నాం. వచ్చే 20 ఏళ్లలో చేపట్టాల్సిన రాష్ట్రాభివృద్ధికి ఇప్పుడే కార్యరూపం ఇస్తున్నాం. అమరావతిలో క్వాంటం వ్యాలీ ద్వారా ఓ ఎకో సిస్టమ్ ను తయారు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. భారత్ లో నైపుణ్యాలు ఉన్నప్పటికీ, క్వాంటం రంగంలో మరింత పెట్టుబడులు రావావ్సి ఉంది. నేషనల్ క్వాంటం మిషన్ ద్వారా పెద్ద ఎత్తున ఈ రంగంలో పెట్టుబడులు, నైపుణ్య కల్పన కోసం కేంద్రం ప్రయత్నిస్తోంది. ఐటీ విప్లవం లాగా ప్రపంచవ్యాప్తంగా క్వాంటం విప్లవాన్ని కూడా భారతీయులు అందిపుచ్చుకోవాల్సి ఉంది. వైద్యం, విద్యుత్, సుస్థిర వ్యవసాయం, ఫైనాన్షియల్ మోడలింగ్, మెటీరియల్స్ డిస్కవరీ, వెదర్ ఫోర్ కాస్టింగ్ లాంటి అంశాల్లో క్వాంటం కంప్యూటింగ్ పరిశోధనలు మానవాళికి ఉపకరిస్తాయి. ఏఐ, క్వాంటం, శాటిలైట్, డ్రోన్ లాంటి టెక్నాలజీలతో వివిధ రంగాల్లో సుస్థిరత సాధించే అవకాశం ఉంటుంది. అతి తక్కువ వ్యయంతోనే ప్రజలకు సేవలు అందించవచ్చు. క్వాంటం టెక్నాలజీ ద్వారా పరిశోధనలకు ఆకాశమే హద్దు.” అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

మన పరిశోధనలు నోబెల్ స్థాయికి చేరేలా క్వాంటం టెక్నాలజీ

“ఏపీ నుంచి ఎవరైనా నోబుల్ ప్రైజ్ సాధిస్తే వంద కోట్లు ఇస్తామని గతంలో ప్రకటించాం. క్వాంటం టెక్నాలజీ ద్వారా దీనిని ఎవరైనా అందిపుచ్చుకుంటే వారికి వంద కోట్లు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నాం. మన పరిశోధనలు ఆ స్థాయిలో ఉండేలా అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ ఉపకరిస్తుంది. అందుకే అమరావతిలో క్వాంటం ఎకోసిస్టం వచ్చేలా ప్రణాళిక చేశాం. వ్యక్తిగత ఔషధాలు, ప్రివెంటివ్, క్యురేటివ్ హెల్త్‌ను క్వాంటం అప్లికేషన్ల ద్వారా అందించే అవకాశం ఉంటుంది. సామర్ధ్యాలు, వేగం, కచ్చితత్వం లాంటివి క్వాంటం టెక్నాలజీ ద్వారా సాధించవచ్చు. వివిధ రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులను క్వాంటం ద్వారా సాధించవచ్చు. ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ ను భారతీయులు అందిపుచ్చుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఏ సాంకేతికత అయినా, విప్లవమైనా ఏపీ నాయకత్వం వహిస్తుంది. ఎవరినీ అనుసరించదు. క్వాంటం కంప్యూటింగ్ పరికరాలను కూడా వచ్చే రెండేళ్లలో అమరావతి నుంచే ఉత్పత్తి చేస్తాం. క్వాంటం నిపుణులు, క్వాంటం కంప్యూటర్లు, పరికరాలను ఏపీ నుంచే ఉత్పత్తి చేసి ప్రపంచానికి అందిస్తాం. క్వాంటం ప్రోగ్రామ్ ప్రకటనకు అనూహ్య స్పందన వచ్చింది. క్వాంటం నిపుణుల్ని తయారు చేసేందుకు ఇచ్చిన ఒక్క ప్రకటన ద్వారా 54 వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. క్వాంటం నిపుణుల్ని తయారు చేసుకునేలా వారికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించాం. క్వాంటం రంగంలో స్కిల్ రోడ్ మ్యాప్‌ సిద్దం చేసుకున్నాం. లక్ష మంది క్వాంటం నిపుణుల్ని తయారు చేసుకోవటమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. క్వాంటం అల్గారిథమ్స్ నేర్చుకోవటం ద్వారా విద్యార్ధులు భవిష్యత్ నిపుణులుగా తయారవుతారు. విజన్‌ను అందిపుచ్చుకోవాలని విద్యార్ధులను కోరుతున్నాను. భవిష్యత్తులో అద్భుతమైన ఫలితాలు అందిపుచ్చుకునే అవకాశం ఉంటుంది. ఏ అంశంలో అయినా ఏపీ ఫాస్ట్ లెర్నర్. అమరావతిలో క్వాంటం వ్యాలీని అద్భుతంగా నిర్మిస్తున్నాం.” అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

మూడు దశాబ్దాల క్రితమే ఐటీ విజన్ తో విప్లవాత్మక మార్పు

“25 ఏళ్ల క్రితం ఐటీ విజన్ రూపొందించి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నాం. అమెరికాకు సిలికాన్ వ్యాలీ లాగే భారత్ క్వాంటం వ్యాలీగా అమరావతిని తీర్చిదిద్దుతున్నాం. విజ్ఞానం భారతీయుల డీఎన్ఏలోనే ఉంది. క్రీస్తు పూర్వం 2500లోనే భారతీయులు అర్బన్ ప్లానింగ్ చేశారు. ఆయుర్వేద, తక్షశిల, నలంద యూనివర్సిటీలు, సిల్క్ రూట్ లాంటి అంశాలే దీనికి నిదర్శనం. గణితంలో జీరోను, అడ్వాన్స్డ్ అస్ట్రానామీ లాంటి రంగాల్లో ఎప్పుడో నైపుణ్యాన్ని భారతీయులు సాధించారు. 2 వేల ఏళ్ల క్రితమే ప్రపంచ జీడీపీలో 40 శాతం భారత్ నుంచే వచ్చేది. ఇప్పుడు 4వ ఆతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా భారత్ ఉంది. హరిత విప్లవం, పారిశ్రామిక విప్లవం కంటే టెక్నాలజీ అందిపుచ్చుకుని సేవల రంగంలో విప్లవం సాధించాం. వైద్యులు, ఇంజనీరింగ్, ఐటీ నిపుణులు ఇతర దేశాలకు వెళ్లి భారతీయుల నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పారు. మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా, జీఎస్టీ లాంటి సంస్కరణలతో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా ఎదుగుతున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతీ నలుగురు ఐటీ నిపుణుల్లో ఒకరు భారతీయులే వారిలోనూ ఏపీ నుంచి వెళ్లిన వారే ఉన్నారు. ఇప్పుడు మన యువత భవిష్యత్తు మరింత ప్రకాశవంతంగా కనిపిస్తోంది. ప్రధాని మోదీ రూపొందించిన వికసిత్ భారత్ లక్ష్యంతో మనదేశం అగ్రశ్రేణి ఆర్ధిక వ్యవస్థగా ఎదుగుతుంది. 30 ట్రిలియన్ డాలర్ ఆర్ధిక వ్యవస్థగా భారత్ తయారవుతుంది. టెక్నాలజీ, ఇన్ఫ్రా డ్రివెన్ ,సస్టెయినబుల్, ఫ్యూచర్ రెడీ ఎకనామీగా భారత్ ఎదుగుతుంది.” అని ముఖ్యమంత్రి అన్నారు. ఈ కార్యక్రమానికి ఐఐటీ మద్రాస్, ఐఐటీ తిరుపతి డైరెక్టర్లు ప్రోఫెసర్ సత్యనారాయణ, ప్రోఫెసర్ కామకోటి, కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం కార్యదర్శి అభయ్ కరాండికర్ సహా వివిధ సంస్థల నిపుణులు హాజరయ్యారు. క్వాంటం టెక్నాలజీ ప్రోగ్రామ్ ను సమర్ధంగా నిర్వహిస్తున్న ఐటీశాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్, సీఎంఓ కార్యదర్శి ప్రద్యుమ్నలను ముఖ్యమంత్రి అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *