సంక్షేమ కార్యక్రమాల అమలులో అశ్రద్ధ కనబరిస్తే చర్యలు తప్పవు….కలెక్టర్ ఆనంద్ .
ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో అశ్రద్ధ కనబరిస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ఆనంద్ అధికారులను హెచ్చరించారు.
క
లెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాల్లో పిజిఆర్ఎస్ అర్జీలు, ఇళ్ల నిర్మాణాల పురోగతి, ఉపాధిహామీ పనులు, పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు మొదలైన అంశాలపై సబ్ కలెక్టరు, ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపిడివోలు, తహశీల్దార్లు, ఆయాశాఖల అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాలను చేరుకోవడంలో అశ్రద్ధగా వుంటే కఠిన చర్యలకు వెనకాడే ప్రసక్తే లేదని హెచ్చరించారు. పిజిఆర్ఎస్ అర్జీలను నిర్దిష్ట గడువులోగా క్వాలిటీగా పరిష్కరించాలని సూచించారు. సిటిజన్ ఫీడ్బాక్ను తీసుకోవాలన్నారు. జిల్లాలో గృహ నిర్మాణాలు, ఉపాధి హామీ పనుల పురోగతి మెరుగుపడాల్సి వుందన్నారు. అధికారులందరూ తమకు కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. గృహనిర్మాణాల్లో వివిధ దశలను పూర్తి చేసి ఇళ్లు పూర్తయ్యేలా ఎంపిడివోలు, హౌసింగ్, ఇంజనీరింగ్ అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. ఎపివోలు ఉపాధిహామీ పనిదినాలను పెంచి కూలీలకు పనులు కల్పించాలన్నారు. హౌసింగ్లో ఉపాధిహామీని అనుసంధానిస్తూ 90రోజుల పనిదినాలు కల్పించాలన్నారు. జిల్లాలోని, విద్యాశాఖాధికారులు ప్రత్యేక దృష్టిపెట్టి బడిఈడు పిల్లలందరూ బడిలో చేరేలా, ఒకటో తరగతిలో రిజిస్ట్రేషన్లు పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. అలాగే పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని సక్రమంగా అందించాలని, మంచినీటి వసతి సౌకర్యాలను మెరుగుపరచాలన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడమే ప్రధాన లక్ష్యంగా యంత్రాంగం పనిచేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్సులో డి ఆర్ ఓ హుస్సేన్ సాహెబ్, హౌసింగ్, డ్వామా పీడీలు వేణుగోపాల్, గంగాభవాని, విద్యుత్ ఎస్ఈ విజయన్, డి ఈ ఓ బాలాజీరావు, డిపిఓ శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
