ఆక్వా కల్చర్ అభివృద్ధికి సంపూర్ణ సహకారం, రైతుల ఆదాయం పెంపే లక్ష్యం : మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఆక్వా రంగం కీలకమైన ఆధారంగా మారిందని, ఆక్వా కల్చర్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తోందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, మత్స్య శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. కృష్ణా జిల్లా పెనమలూరులోని మత్స్య శాఖ కార్యాలయంలో రాష్ట్ర ఆక్వాకల్చర్ అభివృద్ధి అధికార సంస్థ పాలకవర్గ సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమానికి మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచ మార్కెట్లో నెలకొన్న పరిస్థితులు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన టారిఫ్ ల వల్ల ఏర్పడుతున్న ఇబ్బందులు ఆక్వా రైతులపై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో, వాటిని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ చర్యలు తీసుకుంటోందన్నారు. దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రొయ్యలకు ఉన్న నాణ్యత, విశ్వసనీయతపై విస్తృత ప్రచారం అవసరమని, కొత్త మార్కెట్ల అన్వేషణ, ఎగుమతుల పెంపు, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం కృషి చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. నాణ్యతపై ప్రతి రైతు దృష్టి పెట్టాలని, అప్పుడే మంచి ధర లభిస్తుందన్నారు. దేశ మత్స్యరంగంలో ఆంధ్రప్రదేశ్ వాటా 29 శాతం ఉందని తెలిపారు. చేపలు, రొయ్యల చెరువులకు సర్వే నెంబర్ ఆధారంగా రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయాలని సీఎం సూచించారని, ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 48 శాతం చెరువుల రిజిస్ట్రేషన్ పూర్తయిందన్నారు. గతంలో రైతులు చెరువుల రిజిస్ట్రేషన్ విషయంలో ఎదుర్కొన్న ఇబ్బందులను తొలగించామని, చెరువులకు జియో ట్యాగింగ్ కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. ఆక్వారంగ సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకు ఆక్వా రైతులకు రూ.800 కోట్ల విద్యుత్ రాయితీ అందించామని, దీన్ని రూ.1,200 కోట్లకు పెంచుతున్నామని, రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకే విద్యుత్ రాయితీ వర్తిస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
బీసీల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం


బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. విజయవాడలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళింగ వైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవితతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొని, కార్పొరేషన్ చైర్మన్ బోయిన గోవిందరాజులు సహా డైరెక్టర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బలహీన వర్గాల ఎదుగుదల తెలుగుదేశం పార్టీ పాలనలోనే సాధ్యమైందని అన్నారు. గతంలో కులాల వారీగా వారి వృత్తుల ఆధారంగా పరికరాలు అందించి అభివృద్ధికి దోహదం చేశామని, 2019 తర్వాత వచ్చిన ప్రభుత్వం అనగారిన వర్గాల అభ్యున్నతిని పక్కనపెట్టిందని విమర్శించారు. కేవలం గొప్పలు చెప్పుకునేందుకు 54 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. సీఎం చంద్రబాబు నాయుడు బీసీల అభ్యున్నతికి ఆహర్నిశలు శ్రమిస్తున్నారని, జనాభా దామాషా ప్రకారం ప్రతి కార్పొరేషన్కు నిధులు కేటాయించి వర్గాల అభివృద్ధికి వినియోగిస్తామని హామీ ఇచ్చారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే బీసీలకు ఎక్కువగా ఉద్యోగాలు, మెడికల్ సీట్లు లభించాయని గుర్తు చేశారు. వైశ్యులను ఓబీసీలో చేర్చే అంశంపై కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయని, ఈ విషయమై కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రధానితో కూడా చర్చించారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
