సాగునీటి భద్రతకు భరోసా… వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరుతో రైతులకు భారీ ఊరట

0

సీఎం చంద్రబాబు, మంత్రి రవికుమార్ లకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి అచ్చెన్నాయుడు

అమరావతి: ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరుకు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రైతులకు గొప్ప ఊరట కలిగించిందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న రైతుల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ చూపడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు. మొత్తం 46,113 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను దశలవారీగా మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఇందులో ఏపీసీపీడీసీఎల్ పరిధిలో 6,593, ఎస్పీడీసీఎల్ పరిధిలో 11,926, ఈపిడీసీఎల్ పరిధిలో 27,594 కనెక్షన్లు ఉన్నాయని వెల్లడించారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరుకు తన విజ్ఞప్తికి వెంటనే స్పందించి సానుకూల నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కనెక్షన్ల మంజూరుతో రైతులకు సాగునీటి భద్రత లభించి, పంటల దిగుబడి పెరిగే అవకాశం ఉందన్నారు. గతంలో అనేక కారణాల వల్ల పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను ఇప్పుడు ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చి పరిష్కరించడం రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతుందని పేర్కొన్నారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్టం చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతుల సంక్షేమం కోసం అవసరమైన మౌలిక వసతులు, విద్యుత్ సరఫరా, సాగునీటి వనరులను మెరుగుపరచడంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ అంకితభావంతో పనిచేస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రైతుల అభ్యున్నతి కోసం తీసుకునే ప్రతి నిర్ణయం వారి భవిష్యత్తుకు భరోసా కలిగించే విధంగా ఉంటుందని, కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమమే లక్ష్యంగా నిరంతరం ముందుకు సాగుతుందని ఆయన అన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *