సాహితీ ఇన్ఫ్రా కేసులో కీలక మలుపు..ఈడీ విచారణకు జగపతిబాబు
సాహితీ ఇన్ఫ్రా కేసులో కీలక మలుపు..ఈడీ విచారణకు జగపతిబాబు

తెలంగాణ: నటుడు జగపతిబాబు ఈడీ ఎదుట హాజరయ్యారు. ఆయనను నాలుగు గంటల పాటు అధికారులు విచారించినట్లు సమాచారం. సాహితీ ఇన్ఫ్రా కేసులో జగపతిబాబును ఈడీ విచారణకు పిలిచింది. సాహితీ తరపున పలు ప్రకటనలో నటించిన జగపతిబాబుకు, సాహితీ కంపెనీకి మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగాయన్న ఆరోపణల మధ్య ఆయనను ఈడీ విచారించింది. సాహితీ లక్ష్మీనారాయణ కంపెనీ అకౌంట్లో నుంచి జగపతిబాబుకు నగదు బదిలీ అయినట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. పెద్ద మొత్తంలో డబ్బులు బదిలీ అయినందున జగపతిబాబును పిలిచి విచారించినట్లు వెల్లడించారు. జగపతిబాబుకు సాహితి నుంచి వచ్చిన డబ్బులకు సంబంధించి సమాచారం తెలుసుకున్నామని అధికారులు స్పష్టం చేశారు.
సాహితీ ఇన్ఫ్రా, ప్రీ లాంచింగ్ పేరుతో అపార్ట్మెంట్లు, విల్లాల నిర్మాణం పేరిట కొనుగోలుదారుల నుంచి రూ.248.27కోట్ల మేర వసూలు చేసి, నిర్మాణాలు చేపట్టకుండా మోసానికి పాల్పడిందని ఈడీకి ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు సాహితీపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసి ఈడీ దర్యాప్తు చేసింది. సాహితీ నిర్వాహకులు రూ.126కోట్లు కొనుగోలు దారుల నుంచి వసూలు చేసినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. ఆ డబ్బులతో పలు ఆస్తులను కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఈ మేరకు అధికారులు ఆస్తులను గుర్తించి జప్తు చేశారు. సాహితీ కేసులో మరింత లోతైన విచారణలో భారీ ఎత్తున స్కామ్ జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. దీనిలో భాగంగానే సాహితీ ఇన్ర్ఫాకు ప్రకటనలు చేసిన నటినటులను కూడా ఈడీ విచారిస్తోంది.
