హైదరాబాద్‌లో అక్రమ సరోగసీ రాకెట్… లేడీ డాక్టర్ ను అరెస్ట్ చేసిన ఈడీ

0

అక్రమ సరోగసీ కేసులో డాక్టర్ నమ్రతను అరెస్ట్ చేసిన ఈడీ

సంతానం లేని దంపతులకు శిశువులను అక్రమంగా అమ్మకాలు

మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు

ఫిబ్రవరి 26 వరకు నిందితురాలికి జ్యుడీషియల్ రిమాండ్

గతంలోనూ పలు కేసుల్లో అరెస్టయిన డాక్టర్ నమ్రత

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన అక్రమ సరోగసీ రాకెట్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక చర్యలు చేపట్టింది. ఈ కేసుకు సంబంధించి మనీలాండరింగ్ ఆరోపణలపై డాక్టర్ అడుతూరు నమ్రత అలియాస్ పచ్చిపల్లి నమ్రతను శుక్రవారం అరెస్ట్ చేసింది. అనంతరం ఆమెను కోర్టులో హాజరుపరచగా, ఫిబ్రవరి 26 వరకు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.

యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ అండ్ రీసెర్చ్ సెంటర్ పేరుతో నమ్రత ఈ అక్రమ దందా నడిపినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. సంతానం లేని దంపతుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి, వారికి సరోగసీ ద్వారా బిడ్డను అందిస్తామని నమ్మించేవారు. అయితే, పేదరికంతో బిడ్డలను పెంచుకోలేని గర్భిణులను ఏజెంట్ల ద్వారా గుర్తించి, పుట్టిన వెంటనే శిశువులను కొనుగోలు చేసేవారని ఈడీ ఆరోపించింది. ఆడశిశువుకు రూ. 3.5 లక్షలు, మగశిశువుకు రూ. 4.5 లక్షలు చెల్లించి, వారిని సంతానం లేని దంపతులకు అమ్మేవారని దర్యాప్తులో వెల్లడైంది.

ఈ రాకెట్‌పై గతంలోనే హైదరాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్‌లో చీటింగ్, చైల్డ్ ట్రాఫికింగ్ వంటి అభియోగాలపై పలు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. ఆ కేసుల్లో 2025 నవంబర్‌లో బెయిల్‌పై విడుదలైన ఆమె, మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేపట్టిన ఈడీ విచారణకు సహకరించకపోవడంతో తాజాగా పీఎంఎల్‌ఏ చట్టం కింద అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్‌లోని ఆసుపత్రి లైసెన్సు రద్దు కాగా, విశాఖపట్నం కేంద్రంగా ఈ దందాను కొనసాగించినట్లు ఈడీ గుర్తించింది.

దంపతులనే అసలు తల్లిదండ్రులుగా చూపిస్తూ నకిలీ జనన ధృవపత్రాలు సృష్టించినట్లు కూడా ఈడీ తెలిపింది. ఈ రాకెట్‌లో ఏజెంట్లు, సబ్-ఏజెంట్ల నెట్‌వర్క్ కీలకంగా వ్యవహరించిందని, దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు వివరించారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *