హెచ్-1బీ వీసా ఇంటర్వ్యూల రద్దుతో పెరుగుతున్న అనిశ్చితి
హెచ్-1బీ, హె-4 వీసాలకు సోషల్ మీడియా వెట్టింగ్ను విస్తరించిన అమెరికా
ఈ నెల 15 నుంచి ప్రపంచవ్యాప్తంగా కొత్త స్క్రీనింగ్ అమలు
భారత్లో వేలాది వీసా ఇంటర్వ్యూలు నెలల పాటు వాయిదా
భారత ఐటీ నిపుణులు, వైద్యులపై తీవ్ర ప్రభావం
హెచ్-1బీ, హె-4 వీసాల కోసం దరఖాస్తు చేసుకునే వారిపై అమెరికా ప్రభుత్వం మరింత కఠిన చర్యలు తీసుకుంటోంది. ప్రామాణిక వీసా స్క్రీనింగ్లో భాగంగా ఆన్లైన్ ప్రెజెన్స్ (సోషల్ మీడియా) పరిశీలనను అన్ని హెచ్-1బీ, హె-4 వీసాల దరఖాస్తుదారులకు విస్తరించినట్లు అమెరికా ప్రకటించింది. ఈ వెట్టింగ్ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల పౌరులకు వర్తిస్తుందని భారతదేశంలోని అమెరికా రాయబార కార్యాలయం స్పష్టం చేసింది.
ఈ నెల 15 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చిందని, దీంతో ఈ వీసా కేటగిరీలకు సంబంధించి అదనపు ప్రాసెసింగ్ సమయం పట్టే అవకాశముందని ఎంబసీ తెలిపింది. దరఖాస్తుదారులు వీలైనంత త్వరగా అప్లై చేసుకోవాలని సూచించింది. ఈ ప్రకటన వెలువడిన సమయంలోనే భారత్లో ఈ నెలాఖరులో జరగాల్సిన వేలాది హెచ్-1బీ వీసా ఇంటర్వ్యూలను అకస్మాత్తుగా పలు నెలల పాటు వాయిదా వేయడం తీవ్ర ఆందోళనకు దారి తీసింది.
అమెరికా టెక్నాలజీ కంపెనీలు విస్తృతంగా వినియోగించే హెచ్-1బీ వీసా కార్యక్రమంలో భారతీయ నిపుణులు ప్రత్యేకంగా ఐటీ ఉద్యోగులు, వైద్యులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. అయితే హెచ్-1బీ ప్రోగ్రామ్ దుర్వినియోగాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటున్నామని అమెరికా అధికారులు చెబుతున్నారు. అత్యుత్తమ విదేశీ ప్రతిభను నియమించుకునే అవకాశాన్ని కొనసాగిస్తూనే, అక్రమాలు జరగకుండా చూడాలన్నదే తమ ఉద్దేశమని ఎంబసీ వివరించింది.
