రప్పా రప్పా’ బ్యానర్లు వేస్తే మీ షాపు సీజే
అమరావతి: ‘రప్పా రప్పా’ వాక్యాలతో బ్యానర్లు ముద్రిస్తున్నారా? అయితే ఆ షాపులు సీజ్ అయినట్లే! రెచ్చగొట్టే వ్యాఖ్యలు సహించం అంటూ ఏపీ పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అటువంటి వ్యాఖ్యలతో కూడిన ప్లెక్సీని ముద్రించిన ఘటనలో తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలోని రాయల్ ఫ్లెక్సీ ప్రింటింగ్ దుకాణంపై పోలీసులు కేసు నమోదు చేశారు.
శాంతిభద్రతలకు భంగం కలిగించే అంశాలు ఉన్నాయని గుర్తించిన పోలీసులు సోమవారం ఆ దుకాణాన్ని సీజ్ చేసినట్లు ద్వారకాతిరుమల ఎస్సై సుధీర్ తెలిపారు.
ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం రామసింగవరంలో వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ జన్మదినం సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన ప్లెక్సీలో హింసను ప్రోత్సహించే వ్యాఖ్యలు చోటు చేసుకున్నాయి. వచ్చే ఎన్నికల్లో 88 మ్యాజిక్ ఫిగర్ దాటగానే గంగమ్మ జాతరలో వేటతలలు నరికినట్లు రప్పా.. రప్పా.. నరుకుతాం ఒక్కొక్కడిని అనే వాక్యాలు తీవ్ర వివాదానికి దారి తీశాయి.
ఈ ప్లెక్సీపై గ్రామస్థులు, టీడీపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన ఆరుగురు వ్యక్తులు, అలాగే ప్లెక్సీని ప్రింట్ చేసిన దుకాణంపై కేసు నమోదు చేశారు.
రప్పా రప్పా అంటే తప్పు ఏంటని మాజీ సీఎం స్థాయి వ్యక్తి సమర్ధించడం విమర్శలకు దారితీసింది. దీనిని అలుసుగా తీసుకొని వైసిపి కార్యకర్తలు.. తలలు నరుకుతాం అంటూ హెచ్చరికలు జారీ చేసే విధంగా పలుచోట్ల బ్యానర్లను ప్రదర్శిస్తున్నారు. ఇటువంటి వాటిని ఉపేక్షిస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని పోలీసులు భావిస్తున్నారు. ఇటువంటివి ప్రదర్శించే వారినే కాదు. వాటిని ముద్రించే వారిపై సైతం కేసులు పెట్టారు. ఇది అటువంటి వ్యాఖ్యలను ప్రోత్సహించే వారికి ఒక హెచ్చరిక అంటున్నారు.
