ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
తెలంగాణ/మీర్పేట్: ప్రియుడు పెళ్లికి నిరాకరించాడనే మనస్తాపంతో బీటెక్ చదువుతున్న యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
మీర్పేట్ ఎస్ఎస్ఆర్ నగర్లో నివాసముంటున్న అశోక్ కుమార్, రూప దంపతుల కూతురు విహారిక (20) బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. ఇంటి సమీపంలో నివసించే కిషోర్ అనే యువకుడితో విహారిక కొంతకాలంగా ప్రేమలో ఉంది.
ఈ క్రమంలో పెళ్లి చేసుకోవాలని విహారిక యువకుడిని కోరగా, కిషోర్ నిరాకరించినట్లు తెలుస్తోంది. ఈ విషయం ఆమెను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేసింది.
దీంతో ఈ నెల 16న ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయిన విహారిక కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు మీర్పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు.
అనంతరం 18వ తేదీన విహారిక ఇంటికి తిరిగి వచ్చింది. అయితే ప్రేమించిన యువకుడు పెళ్లికి అంగీకరించకపోవడంతో తీవ్రంగా మనస్తాపానికి గురైన ఆమె, చివరకు ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.
ఈ ఘటనపై మీర్పేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువతి మృతి కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలో ముంచింది.
