నాడు, నేడూ, ఎప్పుడూ కార్యకర్తలకు అండగా నిలిచేది తెలుగుదేశం పార్టీ : మంత్రి నారా లోకేష్
నాడు, నేడూ, ఎప్పుడూ కార్యకర్తలకు అండగా నిలిచేది తెలుగుదేశం పార్టీ
దగదర్తిలో మాలేపాటి సుబ్బానాయుడు, భానుచందర్ చిత్రపటాలకు నివాళులు అర్పించిన మంత్రి లోకేష్
కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పిన మంత్రి
మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబానికి అండగా నిలిచి రాజకీయంగా పైకి తీసుకువస్తామని హామీ
దగదర్తి: నాడు, నేడూ, ఎప్పుడూ కార్యకర్తలకు అండగా నిలిచేది తెలుగుదేశం పార్టీనే అని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం దగదర్తిలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాష్ట్ర ఆగ్రోస్ కార్పోరేషన్ ఛైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు, ఆయన సోదరుని కుమారుడు భానుచందర్ చిత్రపటాలకు పూలదండ వేసి మంత్రి నారా లోకేష్ నివాళులు అర్పించారు. సుబ్బానాయుడు నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. దేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. కానీ కేవలం ఒక్క తెలుగుదేశం పార్టీకే బలమైన కార్యకర్తలు ఉన్నారు. ఆ పసుపు జెండా చూస్తేనే తెలుగుదేశం కార్యకర్తలకు ఒక ఎమోషన్. మొన్నటి మహానాడులో కూడా కార్యకర్తే మా అధినేత అని ప్రకటించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. నాడు, నేడూ, ఎప్పుడూ కార్యకర్తలకు అండగా నిలబడేది తెలుగుదేశం పార్టీ. 2014లో కార్యకర్తల కోసం ప్రత్యేకంగా సంక్షేమ నిధి ఏర్పాటుచేశాం. ఇప్పటికే కార్యకర్తల సంక్షేమం కోసం రూ.135 కోట్లు ఖర్చుచేయడం జరిగింది. అంతేకాకుండా గతంలో ఫ్యాక్షన్ దాడుల్లో చనిపోయిన కార్యకర్తల పిల్లల కోసం హైదరాబాద్ లో ఓ మోడల్ స్కూల్ ఏర్పాటుచేసి కార్పోరేట్ విద్య అందిస్తున్నాం. అందులో చదువుకున్న వారు ప్రయోజకులుగా మారారు. నా యువగళం పాదయాత్రలో కూడా కళ్లారా చూశా. ఆనాడు ప్రభాకర్ అన్నను వారి పిల్లల ముందే నరికి చంపితే.. పిల్లలను పార్టీ చదివించింది. వారు డెలాయిట్ లో, యాక్సెంచర్ కంపెనీల్లో పనిచేసే పరిస్థితి.
క్రమశిక్షణ, పట్టుదలకు మారుపేరు మాలేపాటి సుబ్బానాయుడు :
సుబ్బానాయుడు అన్న ఈ రోజు మన మధ్య లేరు. మనం ఆయన్ను కోల్పోయాం. క్రమశిక్షణ, పట్టుదలకు మారుపేరు సుబ్బానాయుడు గారు. నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి 2013లో వచ్చాను. సుబ్బానాయుడు నాకు దగ్గరగా ఉండేవారు. ఆయనతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడుకునే వాళ్లం. మొన్న కేబినెట్ మీటింగ్ లో ఉన్నప్పుడు సుబ్బానాయుడు అన్నకు బ్రెయిన్ స్టోక్ వచ్చిందని, ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారని సమాచారం తెలిసిన వెంటనే వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించాను. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు చెప్పాను. ఆయన్ను కోల్పోవడం చాలా బాధాకరం. అది చూసి భానుని కూడా తెలుగుదేశం పార్టీ కోల్పోవడం చాలా బాధాకరం. రాష్ట్రంలో, నియోజకవర్గంలో బలమైన నాయకుడిని కోల్పోయాం. మండల పార్టీ అధ్యక్షుడిగా, పార్టీ ఉపాధ్యక్షుడిగా, ఆగ్రోస్ కార్పోరేషన్ ఛైర్మన్ గా పార్టీకి, ప్రజలకు అనేక సేవలు అందించారు. 2019 నుంచి 2024 వరకు ఇఆనాటి పాలకులపై పెద్దఎత్తున పోరాటం చేశారు. అందులో నన్ను కూడా భాగస్వామిగా చేశారు. దారి విషయంలో ఆనాడు టీడీపీ కార్యకర్త కరుణాకర్ కుటుంబాన్ని వైసీపీ నేతలు వేధింపులకు గురిచేసినప్పుడు ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఆనాడు సుబ్బానాయుడు గారి నాయకత్వంలో మేమందరం ఆ కుటుంబానికి అండగా నిలిచాం. ఎవరి దగ్గర భూమి పత్రాలు తాకట్టుపెట్టించారో దానిని సుబ్బానాయుడు గారు సొంత నిధులతో విడిపించారు. తర్వాత చంద్రబాబునాయుడు గారు నియోజకవర్గానికి ఎప్పుడు వచ్చినా, ఏ కార్యక్రమం చేసినా పెద్దఎత్తున జయప్రదం చేసేందుకు ఒక ఇంఛార్జ్ గా ఆయన చాలా కష్టపడ్డారు. నేను యువగళం పాదయాత్రలో నియోజకవర్గానికి వచ్చినప్పుడు నాతో ఐదు రోజులు.. మూడు పూటలా నాతోనే ఉన్నారు. నియోజకవర్గ, జిల్లా సమస్యలపై మేం చర్చించాం. జిల్లాలో ఎక్కడ పాదయాత్ర చేసినా నాతో కలిసి నడిచారు. పది రోజులకు ఒకసారి వచ్చి పాదయాత్ర ఎలా జరుగుతుందని అడిగి తెలుసుకునేవారు.
సుబ్బానాయుడు కుటుంబానికి అండగా నిలిచి రాజకీయంగా పైకి తీసుకువస్తాం:
ఇది మాకో పరీక్ష, కుటుంబానికో పరీక్ష. మాకు దేవుడు జయించే శక్తి ఇచ్చాడు. సుబ్బానాయుడు గారి కుటుంబానికి అండగా నిలబడటమే కాదు కుటుంబాన్ని రాజకీయంగా పైకి తీసుకువచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. జాతీయ ప్రధాన కార్యదర్శిగా నా బాధ్యతలు నిర్వర్తిస్తా. కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. కించపరిచే విధంగా పోస్టులు పెడుతున్నారు. అన్నీ గమనిస్తున్నాం. దీనివెనుక ఎవరున్నా కఠిన చర్యలు తీసుకుంటాం. కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలబడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. కుటుంబానికి అండగా నిలబడతాం. రాజకీయంగా పైకి తీసుకువచ్చే బాధ్యత వ్యక్తిగతంగా తాను తీసుకుంటానని చెప్పారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, జిల్లా ఇంఛార్జ్ మంత్రి ఎన్ఎండీ ఫరూక్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు, 
ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఇంటూరి నాగేశ్వరరావు, కాకర్ల సురేష్, నెలవల విజయశ్రీ, పాశం సునీల్ కుమార్, ఎమ్మెల్సీలు బీద రవిచంద్రయాదవ్, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, ఏపీ మారిటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు కావలి పర్యటనకు బయలుదేరిన మంత్రి నారా లోకేష్ కు పార్టీ నాయకులు, కార్యకర్తలు అడుగడుగునా స్వాగతం పలికారు.
