ఆర్టికల్ 370 రద్దుతో శ్యామ్ప్రసాద్ కల సాకారం చేశాం: ప్రధాని మోదీ
ఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దుతో శ్యామ్ప్రసాద్ కల సాకారం చేశామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జమ్మూకాశ్మీర్లో భారత రాజ్యాంగం అమలు చేశామని చెప్పారు. ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగిన భారతరత్న, మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి 101వ జయంతి కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ మధ్యాహ్నం సుమారు 2:30 గంటలకు ఆయన గోమ్తీ నది ఒడ్డున నిర్మించిన రాష్ట్ర ప్రేరణా స్థల్ను జాతికి అంకితం చేశారు. అనంతరం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ
‘కోట్లాదిమందిని పేదరికం నుంచి విముక్తి చేశాం. గతంలో ఒకే కుటుంబం పేరుతో పథకాలు అమలుచేశారు. వాజ్పేయి హయాంలోనే గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి బీజం పడింది. 2014 నుంచి గ్రామాల్లో 4 లక్షల కి.మీ. రోడ్ల నిర్మాణం జరిగింది. దేశంలో ఎక్స్ప్రెస్వేల నిర్మాణం మరింత పుంజుకుంది. వాజ్పేయి హయాంలోనే ఢిల్లీ మెట్రో ప్రారంభమైంది. భవిష్యత్లో అతిపెద్ద మొబైల్ ఫోన్ల ఉత్పత్తి దేశంగా భారత్ మారనుంది. అందరి కృషితోనే వికసిత్ భారత్ సాకారం అవుతుంది. లక్నోలో అతిపెద్ద డిఫెన్స్ కారిడార్ ఉంది.
బ్రహ్మోస్ క్షిపణులు లక్నోలోనే తయారవుతున్నాయి. మన బ్రహ్మోస్ క్షిపణుల సామర్థ్యం ప్రపంచమంతా చూసింది. మొబైల్, ఇంటర్నెట్ వినియోగించే దేశాల్లో భారత్దే అగ్రస్థానం’ అని అన్నారు. కాగా, సుమారు 65 ఎకరాల విస్తీర్ణంలో 230 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మితమైన రాష్ట్ర ప్రేరణా స్థల్ జాతీయ స్మారక సముదాయంలో అటల్ బిహారీ వాజ్పేయితో పాటు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్దయాళ్ ఉపాధ్యాయల ఆదర్శాలకు అనుగుణంగా వారి విగ్రహాలు ఏర్పాటు చేశారు.
