గర్భస్త లింగ నిర్థారణ పరీక్షలు అరికట్టేందుకు డెకాయ్ ఆపరేషన్స్, ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి : కలెక్టర్ హిమాన్షు శుక్లా
నెల్లూరు:జిల్లాలో గర్భస్త లింగ నిర్థారణ పరీక్షలు అరికట్టేందుకు డెకాయ్ ఆపరేషన్స్ మరియు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా
అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ ఛాంబర్లో గర్భస్త పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్టం (పిసి పిఎన్డిటి),సహాయక పునరుత్పత్తి సాంకేతికత చట్టం (ఏ ఆర్ టి) అమలుపై జిల్లాస్థాయి మల్టీ మెంబర్ అప్రాపెట్ అథారిటీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గర్భస్త శిశువులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. లింగనిర్థారణ పరీక్షలు అరికట్టేందుకు, జిల్లాలో వైద్యశాలలు, స్కానింగ్ సెంటర్లపై డెకాయ్ ఆపరేషన్స్ మరియు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలన్నారు. స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలను తప్పక పాటించాలన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేయడమంటే భ్రూణ హత్యలను ప్రోత్సహించడమేనన్నారు. చట్టాన్ని ఉల్లంఘించి లింగ నిర్థారణ పరీక్షలు చేస్తే వైద్యులు, స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కమిటీ సభ్యులు, ఎన్జివోలు లింగ నిర్థారణ పరీక్షలను పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఈ సందర్భంగా సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వి. సుజాత, డి ఐ ఓ డాక్టర్ ఏ. ఉమామహేశ్వరి, గైనకాలజిస్ట్ డాక్టర్ ఆండాళ్ భాస్కర్, డిఎస్పి కె. సిహెచ్. రామారావు, డెమో కె. కనకరత్నం, ఎన్జివో కె. కవితారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
