దేశంలోనే అతి పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ గ్రేటర్ హైదరాబాద్

0
202512163608986

తెలంగాణ: హైదరాబాద్ మహానగర పాలనలో అత్యంత కీలకమైన మార్పులకు శ్రీకారం చుడుతూ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వార్డుల పునర్విభజన ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేసింది. వార్డుల సంఖ్యను రెట్టింపు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తాజాగా తుది నోటిఫికేషన్ విడుదల చేసింది. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న 27 మున్సిపాలిటీలు ,కార్పొరేషన్లను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసిన తర్వాత, పరిపాలనా సౌలభ్యం కోసం ప్రస్తుతం ఉన్న 150 వార్డులను 300కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. సుమారు 2,000 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ మహానగరం ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్‌గా అవతరించింది.

ఈ పునర్విభజనలో భాగంగా నగరంలోని జోన్లు, సర్కిళ్ల సంఖ్యను కూడా ప్రభుత్వం భారీగా పెంచింది. ఇప్పటి వరకు ఉన్న 6 జోన్లను 12కు, అలాగే 30 సర్కిళ్లను 60కి పెంచుతూ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. కొత్తగా ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, శంషాబాద్, గోల్కొండ, రాజేంద్రనగర్ జోన్లు ఏర్పాటు చేశారు. ప్రతి 45 వేల మంది జనాభాకు ఒక వార్డు ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయడంతో పాటు, ప్రతి జోన్‌లో ఐదు సర్కిళ్లు ఉండేలా యంత్రాంగాన్ని పునర్వ్యవస్థీకరించారు.

ప్రాథమిక నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ప్రజలు, రాజకీయ పార్టీల నుండి సుమారు 6,000కు పైగా అభ్యంతరాలు, సూచనలు వచ్చాయి. వాటన్నింటినీ పరిశీలించిన అధికారులు 40 వార్డులకు పాత పేర్లనే కొనసాగించాలని నిర్ణయించారు.

ప్రస్తుత జీహెచ్‌ఎంసీ పాలకమండలి పదవీకాలం 2026 ఫిబ్రవరి 10తో ముగియనుంది. ఈ లోపే వార్డుల పునర్విభజన , ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియను పూర్తి చేసి, కొత్త వార్డుల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ఈ భారీ కార్పొరేషన్‌ను ఒకటిగా ఉంచాలా లేదా మూడు ప్రత్యేక కార్పొరేషన్లుగా విభజించాలా అనే అంశంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ పునర్విభజనతో హైదరాబాద్ మున్సిపల్ రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలు మొదలయ్యే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *